గతేడాది 2019 డిసెంబర్లో చైనాలోని వుహాన్ నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ గురించి ఇంకా శాస్త్రవేత్తలకు పూర్తి అవగాహన రావడం లేదు. దాని గురించి రోజురోజుకో కొత్త విషయం కనుగొంటున్నారు. తాజాగా, ఈ మహమ్మారి రీఇన్ఫెక్షన్లు బయటపడ్డాయి. అయితే, దీనిని కొట్టిపారేయలేమని, దీనిపై లోతైన అధ్యయనం అవసరమని పలువురు సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఇటీవల హాంకాంగ్లో ఓ రీ ఇన్ఫెక్షన్ కేసు వెలుగుచూసింది. అనంతరం బెల్జియం, నెదర్లాండ్స్లోనూ ఒక్కో కేసు బయటపడ్డాయి. అయితే, వీటిపై లోతైన పరిశోధన చేస్తే తప్ప ఓ క్లారిటీ రాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొవిడ్ -19 మహమ్మారిని అరికట్టేందుకు హెర్డ్ ఇమ్యూనిటీ సరిపోకపోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనిపైనా మరిన్ని అధ్యయనాలు చేయాలని అంటున్నారు. ‘రీ ఇన్ఫెక్షన్లపై మాకు ఇంకా స్పష్టత రాలేదు. ఇది టీకాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా చెప్పడం కష్టం.’ అని బెల్జియం వైరాలజిస్ట్ మార్క్ వాన్ రాన్ట్స్ పేర్కొన్నారు.

కొవిడ్ రీ ఇన్ఫెక్షన్ ప్రభావం టీకాపై కచ్చితంగా ఉంటుందని బెల్జియంలోని అకాడెమిక్ హాస్పిటల్ యుజెడ్ లెవెన్లోని క్లినికల్ బయాలజిస్ట్ రాన్ట్స్ పేర్కొన్నారు. అలాగే, కరోనా నుంచి కోలుకున్న ఒక వ్యక్తికి 142 రోజుల తర్వాత రీఇన్ఫెక్షన్ వచ్చినట్లు క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ఒక అధ్యయనం ప్రచురితమైంది. మొదటిసారి రోగిలోని వైరస్ జన్యువులు, రెండోసారి వైరస్ జన్యువులు వేర్వేరుగా ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే హెర్డ్ ఇమ్యూనిటీతో కొవిడ్ను ఎదుర్కోవడం కష్టసాధ్యమైన పనిగా అనిపిస్తున్నదని హాంకాంగ్ సైంటిస్టులు చెబుతున్నారు. కరోనా రోగులు సహజ ఇమ్యూనిటీ లేదా టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకున్నా వైరస్ అనేది మానవ జనాభాలో తిరుగుతూనే ఉంటుందని తమ అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని అంటున్నారు.వ్యాక్సిన్లు వందశాతం రక్షణ కల్పించలేవు.వైరస్కు వ్యతిరేకంగా పనిచేసే రోగనిరోధక వ్యవస్థపై వ్యక్తిగత కేసుల ఆధారంగా తీర్మానాలు చేయలేమని భారత్కు చెందిన ఇమ్యూనాలజిస్ట్ సత్యజిత్ రాత్ అన్నారు. ఈ రీఇన్ఫెక్షన్లపై తమకు ఇంకా ఎలాంటి అవగాహన లేదని, ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా మూడు కేసులు మాత్రమే బయటపడ్డాయని చెప్పారు. ‘ప్రతి వ్యక్తి రోగనిరోధక శక్తి భిన్నంగా ఉంటుంది. దీనిపై స్వాభావిక జన్యులక్షణాలు ప్రభావం చూపుతాయి. అలాగే, అతడి ఆరోగ్య పరిస్థితి, అతడు తీసుకునే ఆహారం, వాడే మందులు ఇమ్యూనిటీ పవర్పై ప్రభావం చూపుతాయి. అందుకే వ్యక్తికి, వ్యక్తికి రోగనిరోధక శక్తిలో తేడాలుంటాయి.’ అని జమ్మూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (ఐఐఐఎం) మాజీ డైరెక్టర్ రామ్ విశ్వకర్మ పేర్కొన్నారు. ప్రస్తుత పరిశోధనలతో సంబంధం లేకుండా ఏదైనా వ్యాక్సిన్ మానవులందరినీ కొవిడ్ నుంచి పూర్తిగా రక్షించకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్లు అనేవి వైరస్ల బలహీన రూపాలని, వంద శాతం రక్షణగా ఉండే వ్యాక్సిన్ లేదని తనకు ఇప్పటికే తెలుసుననని చెప్పారు. అలాగే, హెర్డ్ ఇమ్యూనిటీ కూడా ప్రజలందరికీ ఒకేవిధంగా రక్షించకపోవచ్చన్నారు. ఒక వ్యక్తిలో వ్యాక్సిన్ వల్ల టీ కణాలు పెరగవచ్చు.. మరో వ్యక్తిలో పెరగకపోవచ్చన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రతిరోధకాలను (యాంటీబాడీస్) అభివృద్ధి చేయకపోవచ్చు అని వెల్లడించారు. జీవశాస్త్రపరంగా ప్రజలంతా ఒకేలా ఉండవచ్చు, కానీ రోగనిరోధకపరంగా ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారని ఆయన వివరించారు. ఇమ్యూనిటీ పవర్ గురించి విజ్ఞాన శాస్త్రంలో ఇంకా చాలా స్పష్టత లేదన్నారు. కనుక కరోనా రీఇన్ఫెక్షన్ గురించి తెలుసుకోవాలంటే భవిష్యత్తులోనూ లోతైన పరిశోధన జరగాల్సిందేనని స్పష్టం చేశారు.